హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అదనంగా 485 వెంటిలేటర్లు కొనుగోలు చేసి అవసరమైన హాస్పిటల్స్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో 9 ఎంఆర్ఐలు, 50 సీటీ స్కాన్ యంత్రాలు, 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్య పరికరాలు కొనుగోలు చేయడంతోపాటు వాటి నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్య పరికరాలు నిరంతరం పనిచేయాలంటే శిక్షణ పొందిన టెక్నీషియన్లు కీలకమని అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తేతెలంగాణ): సదరన్, యూడీఐడీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో దివ్యాంగుల చేయూత పింఛన్లు ఆలస్యమవుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. శాసనమండలిలో గురువారం దివ్యాంగులకు పింఛన్ల మంజూరుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తాత్కాలిక సర్టిఫికెట్ల విధానాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 4,66,351 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. అర్హులైన దివ్యాంగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిందని, చివరి తేదీ సెప్టెంబర్ 15 నాటికి దివ్యాంగుల క్యాటగిరీ కింద 1,23,199 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పరిష్కరిస్తామని చెప్పారు.