supreme court| న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై తీవ్ర చర్యలు తీసుకునే కేంద్రంలోని బీజేపీ సర్కారు.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఉదాసీనంగా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టింది. నాగాలాండ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేసింది. ‘మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు. మీకు అనుకూలంగా లేని రాష్ట్రాలపై తీవ్ర చర్యలు తీసుకుంటారు. కానీ మీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర మాత్రం ఎలాంటి చర్యలు ఉండటం లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నాగాలాండ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను అమలుచేయలేదు. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ‘రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరమైన హక్కు. మహిళా రిజర్వేషన్ అందులో భాగమే. రాజ్యాంగ నిబంధనను మీరెందుకు అమలు చేయటం లేదో అర్థం కావడం లేదు. మహిళల విద్య, ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థాయి విషయంలో నాగాలాండ్ మెరుగైన స్థితిలో ఉన్నది. ఇలాంటి రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు అమలుచేయకపోవడాన్ని మేం అంగీకరించలేకపోతున్నాం’ అని జస్టిస్ కౌల్ అన్నారు.