న్యూఢిల్లీ, జూన్ 27: ఫ్లాట్ స్వాధీనం పొందిన తర్వాత కూడా దాని అప్పగింతలో జాప్యానికి పరిహారం కోరుతూ చేసే అభ్యర్థనపై గృహ కొనుగోలుదారు పరిష్కారాన్ని కోరవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటికే ఎటువంటి అభ్యంతరం లేకుండా పిటిషనర్ ఫ్లాట్ని స్వాధీనం చేసుకున్నందున, ఫ్లాట్ని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం కారణంగా సేవా లోపం ఉందని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేసిన సమయంలో సదరు వ్యక్తి ‘వినియోగదారుడు’ కాదని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) 2016లో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2003 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఒక సహకార గృహ నిర్మాణ సొసైటీలో సభ్యునిగా చేరి ఒక ఫ్లాట్ను పొందిన గృహ కొనుగోలుదారు ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.
స్వాధీనం(పొసెషన్) చేయడంలో జాప్యం జరిగినందుకు పరిహారం కోరే అంశం వాస్తవంగా స్వాధీనం చేయడానికి ముందున్న కాలానికి సంబంధించిందేనని జూన్ 4 నాటి తన ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. ఫ్లాట్ స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా సేవా లోపం జరిగిందని ఆరోపిస్తూ అప్పీలుదారు జిల్లా వినియోగదారుల ఫోరమ్లో తొలుత ఫిర్యాదును దాఖలు చేశారు. 2009 జూలైలో జిల్లా ఫోరమ్ సంబంధిత పక్షాలను మధ్యవర్తిత్వానికి పంపింది.
2013 ఫిబ్రవరిలో ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదా పరిష్కార కమిషన్ ఆ ఆదేశాన్ని సమర్థించింది. అనంతరం అప్పీలుదారు ఎన్డీసీఆర్సీని ఆశ్రయించగా అది 2016 జనవరిలో ఆయన రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. పార్టీల మధ్య ఉన్న ఒప్పందంలోని మధ్యవర్తిత్వ నిబంధన ఆధారంగా మాత్రమే వినియోగదారుల ఫిర్యాదును మధ్యవర్తిత్వానికి పంపలేరని అప్పీలుదారుడు సుప్రీంకోర్టు ముందు వాదించారు.