Supreme Court | చైనా జాతీయుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చైనీస్ సిటిజన్ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారించింది. నేరం తీవ్రత దృష్ట్యా బెయిల్ను ప్రస్తుతానికి పరిగణలోకి తీసుకోలేమని చెప్పింది. అలహాబాద్ హైకోర్టు జులై 31న ఇచ్చిన ఆదేశాలపై చైనా పౌరుడు రెన్ చావో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైమ్ రాకెట్ను నడుతుపుతున్నాడని.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని చావోపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో చావోకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. భారత్లో వ్యాపారం చేసేందుకు వచ్చిన విదేశీయులు భారతీ చట్టాల ప్రకారం.. జవాబుదారీగా ఉండాలని.. నేర విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి భారత కోర్టుల్లో విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హైకోర్టు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో స్పష్టం చేసింది. చైనా జాతీయుడి తరఫున న్యాయవాది పీఎన్ పూరి వాదనలు వినిపించారు.
చావో 18నెలలుగా జైలులో ఉంటున్నాడని తెలిపారు. ఆరు నెలల తర్వాత తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని.. హైకోర్టు పరిశీలన ప్రభావితం చేయకుండా మెరిట్పై నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర ఆరోపణల కింద రెన్ చావోను నోయిడా పోలీసులు 2022, జూలై 9న అరెస్టు చేశారు. చావోపై యూపీ పోలీసులు విదేశీయుల చట్టం కింద అభియోగాలు మోపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ-ఎఫ్ఐఆర్ నివేదికను తారుమారు చేశాడని ఆరోపణలున్నాయి. ఈ-వ్యవస్థతో విదేశీ పౌరులు భారత ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో వీసా, ఇమ్మిగ్రేషన్ సంబంధిత సేవలకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించే ఆన్లైన్ సిస్టమ్.