న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి ఈనెల 25 నుంచి నవంబర్ 21 వరకూ విదేశాల్లో పర్యటించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. విదేశాలకు వెళ్లే ముందుగా కోర్టు రిజిస్ట్రీకి రూ కోటి డిపాజిట్ చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం కార్తీ చిదంబరాన్ని కోరింది. మరోవైపు కార్తీ చిదంబరం విచారణకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్ధానానికి నివేదించారు. ఆయనకు సమన్లు జారీ చేసినా దర్యాప్తు అధికారుల ఎదుట కార్తీ చిదంబరం హాజరు కావడం లేదని తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో ఆయన సహకారం గురించి కూడా తదుపరి పరిశీలనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపులోకి రూ 305 కోట్ల విదేశీ నిధుల విషయంలో ఎఫ్ఐపీబీ క్లియరెన్స్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై 2017లో సీబీఐ కార్తీ చిదంబరంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో కార్తీ చిదంబరం తండ్రి పీ చిదంబరం ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నారు.