Supreme Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసు (Nithari serial killings case) లో సుప్రీంకోర్టు (Supreme court) సంచలన తీర్పు చెప్పింది. కేసులో నిందితుడిగా ఉన్న సురేంద్ర కోలి (Surendra Koli) ని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. నిందితుడిపై నేరారోపణలు రుజువు కానందున నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
ఆయనపై నమోదైన ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలడంతో సురేంద్ర దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత విడుదల కాబోతున్నాడు. కాగా, నోయిడా సమీపంలోని నిఠారీ గ్రామంలో 2005-06 మధ్యకాలంలో చిన్నారులు, యువతులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఫిర్యాదులను మొదట్లో పోలీసులు తేలికగా తీసుకున్నా.. బాధితుల సంఖ్య పెరుగడం, మీడియాలో వరుస కథనాలు రావడంతో తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో 2006 డిసెంబర్ 29న ఒక ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. దాంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది. అస్థిపంజరాలు బయటపడ్డ డ్రెయిన్ను ఆనుకుని వ్యాపారవేత్త అయిన మోనిందర్ సింగ్ పందేర్ ఇల్లు ఉంది. ముందుగా ఆ ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలిని ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు.
తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ చేతికి వెళ్లింది. 2007 నుంచి మూడేళ్లపాటు విచారణ జరిపిన సీబీఐ.. మోనిందర్తోపాటు సురేంద్ర కోలిని నిందితులుగా పేర్కొంది. చాక్లెట్లు చూపించి చిన్న పిల్లలను సురేంద్ర రప్పించేవాడని, మోనిందర్తో కలిసి హత్యాచారం చేసేవాడని అభియోగం నమోదు చేసింది. నిందితులపై నరమాంసం భక్షణ, ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం (అస్థిపంజరాలను కాలువలో పడేయడం) లాంటి అభియోగాలను కూడా మోపింది.
విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిందితులు ఇద్దరికీ మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఇద్దరూ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించగా తిరస్కారం ఎదురైంది. అయితే 2023లో అలహాబాద్ హైకోర్టు కోలిని 12 కేసుల్లో, పందేర్ని రెండు కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. దాంతో అదే ఏడాది అక్టోబర్లో పందేర్ జైలు నుంచి విడుదలయ్యారు. దాంతో సీబీఐతోపాటు బాధిత కుటుంబాలు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
అయితే సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలై 31వ తేదీన ఆ అప్పీల్ను తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. మరోవైపు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష రద్దు కోరుతూ సురేంద్ర కోలి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. సరైన ఆధారాల లేవని, విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ కోలీ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.