అమరావతి: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లోని కూటమి ( Alliance ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సీట్ల పంపిణి ఫార్ములా స్థానిక సమరంలో వర్తించదని ఆయన స్పష్టంచేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించిన జనసేన ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో పవన్ కల్యాణ్ ఒక అడుగు వెనక్కితగ్గారని ,ఇప్పుడు పార్టీల బలాబలాల ఆధారంగా సీట్ల పంపిణీ ఉంటుందని అన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన వారందరికీ స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ఎన్డీయే సమన్వయ కమిటీ సమావేశాల్లో అన్నిఅంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటా మని వివరించారు. బలాబలాలను చూసుకుని జనసేన కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా , అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా కూటమి నాయకత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.