టెహ్రాన్: ఇరాన్ భారీ దాడి(Iran Attack) చేసింది. అమెరికాకు చెందిన మిలిటరీ విమానాలను ధ్వంసం చేసింది. జోర్డాన్లో ఉన్న అమెరికా బేస్పై అటాక్ జరిగింది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. గత రాత్రి జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్కు చెందిన సుమారు మూడు క్షిపణులను కూల్చినట్లు జోర్డాన్ మిలిటరీ వెల్లడించింది. ఇవాళ జరిగిన దాడి గురించి ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటన చేసింది. అమెరికా వైమానిక దళానికి చెందిన అనేక రీఫ్యూయలింగ్ విమానాలు, యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలో ఉన్న అల్ తానఫ్ అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ను కూడా అటాక్ చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.
వరుసగా ఆరో రోజు గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్ మౌళిక సదుపాయాలను టార్గెట్ చేసింది. ఆ దేశంలో ఉన్న అనేక బ్రిడ్జీలను నేలమట్టం చేసింది. అయితే ఈ దశలో ఇరాన్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఒకవేళ దాడులు ఉదృతం అయితే, అప్పుడు యావత్ పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ తన హెచ్చరికలో పేర్కొన్నది. హర్మోజ్గన్ ప్రావిన్సులో జరిగిన దాడుల్లో అయిదు బ్రిడ్జీలను అమెరికా విమాన సిబ్బంది పేల్చేసింది. కీలకమైన బందర్ అబ్బాస్ పోర్టు నగరానికి లింకున్న బ్రిడ్జీలను కూల్చివేసినట్లు తెలుస్తోంది.