న్యూఢిల్లీ, జనవరి 7: నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2021-22 విద్యాసంవత్సరానికిగాను ఆలిండియా కోటా సీట్లలో ఓబీసీ క్యాటగిరీకి 27 శాతం, ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడిన తరగతుల) క్యాటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కోర్టు ఆమోదం తెలిపింది. ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడం ప్రస్తుతం అత్యావకశ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 2019 జూలై 29న కేంద్రం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులను గుర్తించి దాని ప్రకారం నీట్-పీజీ, నీట్-యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పాండే కమిటీ సిఫారసుల మేరకు రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఈడబ్ల్యూఎస్ కోటాపై పాండే కమిటీ సిఫారసులపై మార్చి మూడో వారంలో తుది వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కాగా, నీట్ పీజీ ప్రవేశాల ప్రక్రియకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపడంపై ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. వైద్య రంగంలో ఇది చారిత్రాత్మకమైన రోజని అభివర్ణించింది.