పాట్నా : బీహార్లో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని పంచ్ పంచాయతీలో ఓటమి పాలైన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.
పంచ్ పంచాయతీకి బాబుల్ హసన్(50), ఇమ్మాముల్ హసన్(45) పోటీ చేశారు. అయితే బాబుల్ హసన్ పోటీని ఇమ్మాముల్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. అవేమీ పట్టించుకోకుండా బాబుల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఆయన ఓటమి పాలయ్యాడు. దీంతో ఇమ్మాముల్తో పాటు ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. బాబుల్ను ఇనుపరాడ్తో చితకబాది అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఈ హత్యతో పంచ్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు బలగాలు మోహరించారు. బాబుల్ హత్య కేసులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.