Sukesh Chandrasekhar | సుకేశ్ చంద్రశేఖర్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మాయ మాటలతో కోట్ల రూపాయల దోపిడీ చేయడం, అక్రమాలకు పాల్పడడం, జైలు అధికారులకు ముడుపులు అప్పగించడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి అంతకుముందు ఏకంగా ఢిల్లీలోని రోహిణీ సెంట్రల్ జైలులో ఉంటూనే జైలు అధికారుల సాయంతో దోపిడీ రాకెట్ నడిపించారు. ఇందుకు జైలు అధికారులకు కోట్ల రూపాయలు లంచంగా ఇవ్వడం, జైలులో లగ్జరీ లైఫ్ అనుభవించాడనే విషయంపై ఇండియా టుడే ప్రత్యేక కథనం ప్రచురించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): సుకేశ్ చంద్రశేఖర్.. రోహిణీ సెంట్రల్ జైలు అధికారులకు నెలనెలా జీతంలాగా కోట్ల రూపాయలు ఇచ్చి తన దోపిడీ దందా నడిపాడని దర్యాప్తు వర్గాలు వెల్లడించినట్టు ఇండియా టుడే తన కథనంలో పేర్కొన్నది. జైలు సెల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించడం, దోపిడీ రాకెట్ను కొనసాగించడంలో సహకరించినందుకు గానూ రోహిణీ జైలు సూపరింటెండెంట్ సుందర్ బోరా తదితరులు జైలు పాలయ్యారు.
జైలులోనే సకల సౌకర్యాలు
జైలులో సుకేశ్ చంద్రశేఖర్కు ఐఫోన్ 12ప్రో ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు. కొవిడ్ సమయంలో ప్రత్యేక బ్యారక్ కూడా కేటాయించారు. తన అక్రమ కార్యకలాపాలు కనిపించకుండా చేసేందుకు సుకేశ్ సెల్లో సీసీటీవీని కర్టెన్లు, వాటర్ బాటిళ్ల ద్వారా కనిపించకుండా చేశారు. సుకేశ్ టెలిగ్రామ్, వాట్సాప్ వంటి యాప్ల ద్వారా అదితి సింగ్, ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేవాడు. ఆఖరుకు జైలు సూపరింటెండెంట్ చాంబర్ నుంచే ఫోన్లు చేసి తన వ్యవహారాలు నడిపేవాడు.
అసలు సుకేశ్ ఎవరు?
సుకేశ్ చంద్రశేఖర్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ రాన్బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య అదితి సింగ్ నుంచి 200 కోట్లు వసూలు చేశాడన్న అభియోగంపై జైలులో ఉన్నాడు. సుకేశ్ చంద్రశేఖర్ రోహిణీ జైలులో ఉన్న సమయంలోనే తాను కేంద్ర ప్రభుత్వ అధికారిగా చెప్పుకొని, మనీలాండరింగ్ కేసులో శివిందర్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి రూ.200 కోట్లు గుంజాడు.