Sugar price | న్యూఢిల్లీ: బియ్యం, పప్పులు, పలు ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో, ఇప్పుడు చక్కెర వంతు వచ్చింది. దేశీయంగా గత మూడు వారాలుగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయికి చేరిన ఈ ధరలు మరో 2-3 నెలలు కొనసాగే అవకాశం ఉన్నదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరిపడా నిల్వలు లేకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరకు ఉత్పత్తిపై నెలకొన్న ఆందోళన, క్రష్షింగ్ సీజన్ ప్రారంభంలో నెలకొన్న ఆలస్యం ఇందుకు కారణమని జేఎం ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొన్నది. చెరకు ఉత్పత్తిపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే, అంతర్జాతీయంగా కూడా చక్కెర ధరలు భారీగా పెరుగుతాయని, 12 ఏండ్ల గరిష్ఠానికి చేరుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో చక్కెర ఉత్పత్తి పడిపోతుందనే అంచనాలు ఉన్నాయి. 2023, అక్టోబర్-2024, సెప్టెంబర్ సీజన్లో నికర చక్కెర ఉత్పత్తి 31.7 మిలియన్ టన్నులుగా ఉంటుందని ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధానంగా చెరకు ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మెజార్టీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ర్టాల్లోనే దేశ ఉత్పత్తితో 45-50 శాతం ఉంటుంది. సకాలంలో వర్షాలు పడని కారణంగా రైతులు పంట మార్చే అవకాశం ఉన్నదని, ఫలితంగా చక్కెర ఉత్పత్తి అంచనా మరింతగా పడిపోతుందని, రాబోవు సీజన్లో దాదాపుగా 30 మిలియన్ టన్నులుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. దేశీయ వినియోగం 28-28.5 మిలియన్ టన్నులుగా ఉంటుందని, పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఏమీ ఉండవని పేర్కొన్నది. ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఏదైనా ఉంటే.. అది వచ్చే ఏడాది మే తర్వాతనే ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.