Sudhanshu Trivedi : నీతి ఆయోగ్ భేటీలో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని, తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. విపక్షంలో నాయకత్వం కోసం పోటీ మొదలైందని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది పేర్కొన్నారు. నీతి ఆయోగ్ భేటీకి విపక్ష ముఖ్యమంత్రులు హాజరు కారని కాంగ్రెస్ ప్రకటించిన క్రమంలో మీడియా దృష్టిని ఆకర్షించేందుకే మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ నిర్ణయాన్ని గుడ్డిగా అనుసరించబోననే సంకేతాలు పంపుతూ తాను స్వతంత్రంగా వ్యవహరిస్తానని చాటేందుకే ఆమె నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా తాను ఫోకస్ కావాలని ఆమె కోరుకుంటారని చెప్పారు. మమతా బెనర్జీ మైక్ను స్విచాఫ్ చేయలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ఎదుగుదలతో ప్రాంతీయ పార్టీల భవితవ్యం గురించి మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారని అన్నారు.
కాగా, నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించిన తీరు అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. పార్లమెంట్లో విపక్ష నేతల మైక్ కట్ చేయడం ఇప్పటివరకూ చూశామని, ఇక నీతి ఆయోగ్ సమావేశంలోనూ సీఎంల మైక్లు కట్ చేయడం వరకూ కాషాయ పాలకులు వెళ్లడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
మైక్ ఆపేస్తే అందరూ మౌనం దాల్చుతారని బీజేపీ పాలకులు అనుకుంటున్నారని, కానీ దేశ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారనేది కాషాయ పాలకులు గుర్తెరగాలని ఆయన హితవు పలికారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.
Read More :
Road Damage | గోషామహల్లో కుంగిన రోడ్డు..బోల్తా పడిన డీసీఎం : వీడియో