బెంగళూరు, ఏప్రిల్ 11: కర్ణాటక కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆరుగురు మంత్రుల కుమారులు, కుమార్తెలు బరిలో నిలిచారు. వీరితోపాటు మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ సతీమణి ప్రభా మల్లికార్జున్ కూడా పోటీచేస్తున్నారు.
వాస్తవానికి పలువురు మంత్రులను లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే మంత్రులు అందుకు ససేమిరా అనడంతో వారి కుటుంబ సభ్యులను పార్టీ బరిలోకి దింపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్కు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. రాబోయే ఎన్నికల్లో 15 నుంచి 20 సీట్లు సాధించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26, మే7న మొత్తం రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కొడుకు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ బెల్గాం నుంచి పోటీ పడుతున్నారు. అలాగే ఈశ్వర్ ఖండ్రే కుమారుడు సాగర్ ఖండ్రే బీదర్ నుంచి పోటీ చేస్తుండగా.. హెచ్సీ మహాదేవప్ప కుమారుడు సునీల్ బోస్ చామరాజ నగర్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే సతీశ్ జార్కిహోళి కుమార్తె ప్రియాంక జార్కిహోళి చిక్కోడి నుంచి, శివానంద పాటిల్ కుమార్తె సంయుక్త పాటిల్ బాగల్ కోట్ నుంచి, రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి బెంగళూరు సౌత్ నుంచి బరిలో నిలిచారు.
ఇక మరో మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ భార్య, సీనియర్ నేత షామనూరు శివశంకరప్ప కోడలు అయిన ప్రభా మల్లికార్జున్ దావణగెరె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డికి మినహా మిగిలిన ఎంపీ అభ్యర్థులెవరికీ రాజకీయ అనుభవం లేదు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి.. కలబుర్గి (గుల్బర్గా) నుంచి పోటీ చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేశ్ను బెంగళూరు రూరల్ నుంచి పోటీకి నిలబెట్టారు. ఇతనికి ప్రత్యర్థిగా మాజీ ప్రధాని దేవగౌడ అల్లుడు, ప్రముఖ కార్డియాలజిస్ట్ను బీజేపీ, జేడీ(ఎస్) సంయుక్త అభ్యర్థిగా రంగంలోకి దింపాయి.