న్యూఢిల్లీ, జూలై 13: అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు, యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని ఆదేశించిన భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సిట్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సిట్ స్టేటస్ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో అందచేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియచేశారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు ఫోరెన్సిక్ ఆడిట్, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును పిటిషనర్లు కోరుతున్నారు.
రామ మందిర విరాళాల చోరీ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఆలయ పరిపాలనా వ్యవహారాలకు, దైనందిన కార్యకలాపాల పర్యవేక్షణకు అధిపతిగా వ్యవహరించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) పదవికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 18వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని ట్రస్ట్ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దేశంలోని అత్యంత ముఖ్యమైన మతపరమైన క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన రామ మందిరానికి కొత్త పరిపాలనా అధిపతి నియామకానికి మార్గం సుగమం చేస్తూ ఎంపిక కమిటీ అర్హతా ప్రమాణాలను ఖరారు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ట్రస్ట్ నిర్దేశించిన అర్హతల ప్రకారం అభ్యర్థి వయసు 50-70 ఏండ్ల లోపు ఉండాలి. గ్రాడ్యుయేట్ అయ్యుండి, పరిపాలన/ఆర్థిక రంగంలో 20 ఏండ్లు, అంతకు మించిన అనుభవం ఉండాలి. గతంలో ఆలయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉం టుంది. తప్పనిసరిగా హిందూ మతాన్ని అనుసరించేవారై ఉండాలి. పదవీకాలం మూడేండ్లు ఉంటుంది. తప్పనిసరిగా అయోధ్యలో నివసించాలి. నెలరోజుల్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ట్రస్ట్ తన నోటిఫికేషన్లో తెలిపింది.