న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో 70 శాతం మందికి థర్డ్ వేవ్లో ఇన్ఫెక్షన్ సోకలేదని భారత్లో 6000 మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకా రెండు డోసులు తీసుకుని ప్రికాషన్ డోసు తీసుకోని వారిలో 45 శాతం మందికి థర్డ్ వేవ్లో వైరస్ సోకిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కరోనా వైరస్పై ఐఎంఏ జాతీయ టాస్క్ఫోర్స్ కో చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. సర్వే చేసిన వారిలో 24 శాతం మంది 40 ఏండ్ల లోపు వారు కాగా సగం మంది 40-59 ఏండ్ల వయసు వారు. 53 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలున్నారు.
బూస్టర్ డోసు తీసుకున్న 2383 మందిలో 30 శాతం మంది కరోనా థర్డ్ వేవ్లో వైరస్ బారినపడ్డారు. బూస్టర్ డోసు తీసుకున్న వారిలోనూ ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు కాగా వారు ఎన్95 మాస్క్ వాడటం వంటి జాగ్రత్తలు పాటించారని అధ్యయనం తెలిపింది. సెకండ్ డోస్ తర్వాత బూస్టర్ డోసు మధ్య అధిక గ్యాప్ ఉండటంతో థర్డ్ వేవ్లో ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ సోకిందని అధ్యయనం అంచనా వేసింది. ఇక థర్డ్ వేవ్ 40 ఏండ్ల వయసు లోపు వారిపై అధికంగా ప్రభావం చూపిందని పేర్కొంది. వీరిలో 45 శాతం మందికి వైరస సోకింది.
ఇక 80 ఏండ్లు పైబడిన వారిలో కేవలం 21.2 శాతం మందే వైరస్ బారినపడటం గమనార్హం. అధ్యయనంలో పాల్గొన్న వారిలో థర్డ్ వేవ్లో 4.8 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. 53 శాతం మందిలో స్వల్ప లక్షణాలు కనిపించగా 41.5 శాతం మందిలో ఓ మాదిరి లక్షణాలు బయటపడ్డాయి. ఇక తీవ్ర లక్షణాలతో కవలం 0.69 శాతం మంది బాధపడ్డారని అధ్యయనంలో వెల్లడైంది. ఇక థర్డ్వేవ్లో కొవ్యాక్సిన్, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న వారిలో ఒకే రకమైన ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని తెలిపింది.