Karnataka | హైదరాబాద్, నవంబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదు. గదగ్ జిల్లా లక్కలకట్టి గ్రామంలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని, కిలో కూరగాయలను 100 మంది విద్యార్థులకు సరిపెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారం పప్పు, కోడిగుడ్డు, కూరలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలి. కానీ 441 మంది విద్యార్థులకు 4 కిలోల కూరగాయలతో సాంబారు చేసి సరి పెడుతున్నారు. అంటే కిలో కూరగాయలను 100 మంది విద్యార్థులకు సరిపెట్టడం ఏమిటంటూ విద్యార్థులు రోడెక్కారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవటం లేదంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడిని వెంటనే బదిలీ చేయాలని అధికారులను కోరారు.
దేశంలో ఒకటి రెండు రాష్ర్టాలు మినహా అన్ని రాష్ర్టాలు 1 నుంచి 8వ తరగుతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 9, 10 తరగతుల వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా ఉదయం పూట టిఫిన్ కూడా అందిస్తున్నారు. మిగతా రాష్ర్టాల్లో దొడ్డు బియ్యం అన్నం పెడుతుండగా, తెలంగాణలో సన్న బియ్యం అన్నం పెడుతున్నారు. భోజనంలో అరటి పండ్లు, కోడిగుడ్డు (వారానికి 3 సార్లు), లేత మొలకలు, రాగి జావ అందిస్తున్నారు. అంతేగాకుండా పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, రెండు జతల యూనిఫామ్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు.
నాణ్యత లేని భోజనం పెడుతుండటంతో నేను పాఠశాలకు వెళ్లి టీచర్తో మాట్లాడాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. నాసిరకం భోజనమే పెడుతున్నారు. దీంతో పిల్లలు ఆ భోజనాన్ని తినటం లేదు.
-ప్రదీప్ లమాని, విద్యార్థి తండ్రి