భోపాల్, జూలై 3: మధ్యప్రదేశ్లోని దామో పట్టణంలో ముస్లిం మహిళ ప్రిన్సిపాల్గా ఉన్న ఉన్నత పాఠశాల అది. పేదలు, మధ్యతరగతి పిల్లలు చదువుకొనే దాని పేరు గంగా జమున స్కూల్. గత విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఆ పాఠశాల 98.5 శాతం ఉత్తీర్ణత సాధించింది. దీంతో టాప్ ర్యాంకర్ల ఫొటోలతో పాఠశాల యాజమాన్యం ఒక పోస్టర్ ముద్రించి ప్రచారం చేసుకొన్నది. ఆ ఫొటోలలో ఒక హిందూ విద్యార్థిని తలపై ముసుగు ధరించి కనిపించింది. దీనిని సాకుగా తీసుకున్న కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఆ పాఠశాలపై దుష్ప్రచారం ప్రారంభించాయి. ఆ పాఠశాలలో హిందూ విద్యార్థినులను హిజాబ్ (తలపై ముసుగు) ధరించాలని ఒత్తిడి చేస్తున్నారని, మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజానిజాలపై పూర్తిగా దర్యాప్తు చేయకుండానే అధికారులు ఆ స్కూల్ను మూసివేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ లైసెన్స్ను కూడా ఇటీవల రద్దు చేసింది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న మొత్తం 1200 మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
గంగా-జమున పాఠశాలను తిరిగి తెరవాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్కార్ఫ్ ధరించాలని తమను ఎవరూ బలవంతం చేయలేదని, పాఠశాల డ్రెస్ కోడ్లో భాగంగా ధరించామని విద్యార్థు లు చెబుతున్నారు. పాఠశాలను తిరిగి తెరవాలని కోరుతూ ఇటీవల అనేకమంది తల్లిదండ్రులు జిల్లా మేజిస్ట్రేట్ను కలిసి విన్నవించుకున్నారు. గంగా జమున పాఠశాలలో చాలా తక్కువ ఫీజులు ఉంటాయని, ముగ్గురు పిల్లల్ని చేర్పిస్తే ఒకరి ఫీజును మినహాయిస్తారని వారు తమ గోడును వెల్లబోసుకున్నారు. నిజాలను ఒక్క మీడియా కూడా చూపించడం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ అప్షా షేక్ ఆవేదన వ్యక్తం చేశారు.