న్యూఢిల్లీ: ‘సారీ మమ్మీ, నిన్ను చాలాసార్లు బాధపెట్టా.. ఇక ఇదే చివరి సారి. స్కూల్లో టీచర్లు ఇలాగే ఉంటారు. నేను ఏం చేయాలి చెప్పు?’.. ఇవి ఆత్మహత్యకు పాల్పడిన ఓ పదో తరగతి విద్యార్థి (Student Suicide) సూసైడ్ లెటర్లో తన తల్లితో అన్న మాటలు. ఉపాధ్యాయుల వేధింపులతో ఢిల్లీలోని (Delhi Student) ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏండ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ (Metro Station) నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠశాల ఉపాధ్యాయుల వేధింపులేనని కారణమని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్ను వదిలివెళ్లాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం 7.15 గంటలకు తన తండ్రి ఆ విద్యార్థిని పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. అయితే అదేరోజు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో గాయాలతో ఆ బాలుడు పడి ఉన్నట్లు తండ్రికి ఫోన్ వచ్చింది. దీంతో బీఎల్ కపూర్ దవాఖానకు తరలించాలని తాము అక్కడి వస్తామని ఆ ఫోన్ చేసిన వారికి తండ్రి సూచించాడు. అయితే వారు అక్కడి చేరుకునే సరికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుమారుడిని కోల్పోయిన తండ్రి సదరు పాఠశాల ప్రిన్సిపల్, ముగ్గురు ఉపాధ్యాయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తన కొడుకును మానసికంగా హింసించడం వల్లే ప్రాణాలను తీసుకున్నాడని అందులో పేర్కొన్నాడు. ‘గత కొద్ది రోజులుగా నా కుమారుడిని పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు. మంగళవారం ఒక డ్రామా క్లాసులో నా కుమారుడు పడిపోతే, ఒక టీచర్ అతనిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు. దీంతో నా కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, ఆ టీచర్ నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను అని అన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నా, తన కుమారునిపై వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు’ అని ఆరోపించారు.
కాగా బాలుని బ్యాగులో దొరికిన సూసైడ్ నోట్లో.. అమ్మ నన్ను క్షమించి. నీ హృదయాన్ని ఎన్నోసార్లు గాయపరిచారు. ఇక ఇదే చివరిసారి. స్కూల్లో టీచర్లు చేసే పని ఇలా ఉంది. నేనేం చేయాలి చెప్పు. నా అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయండి అని రాశాడు. తన పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను తెలియజేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా మరే విద్యార్థీ తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని వేడుకున్నాడు. తన అన్నయ్యకు, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. అలాగే ఈ లెటర్ చదివినవారు ఈ నంబర్కు కాల్ చేసి, తాను చేసిన పనికి చింతిస్తున్నానని, పాఠశాలలో జరిగిన దానిని తట్టుకునేందుకు తనకు వేరే మార్గం లేదని భావిస్తున్నానని తెలిపాడు.