Mumbai school bus : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని చెంబూర్లో మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెంబూర్, రోడ్ నెంబర్ 11లోని యూనివర్సల్ స్కూల్ నుంచి విద్యార్థులు బస్సులో ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
ఈ క్రమంలో స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 18 మంది విద్యార్థుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు బస్సులో నలిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని విద్యార్థుల్ని బస్సు నుంచి బయటకు తీశారు. ఐదుగురిని ఆస్పత్రికి తరలించగా, ఒక విద్యార్థి మరణించాడు. మిగతా నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం అనంతరం అధికారులు ఘటనా స్థలంలో చెట్టును తొలగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న చెట్లను తొలగించాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవలే ఇలాంటి ఘటన ఇంకోటి జరిగిందని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి.