చెన్నై : అనారోగ్యం బాధిస్తున్నా పరీక్షలు మిస్ కాకూడదనే సంకల్పంతో బాలిక ఏకంగా అంబులెన్స్లోనే పరీక్షా కేంద్రానికి హాజరైన ఉదంతం తమిళనాడులోని తిరుపూర్ జిల్లా కుప్పందంపాళ్యంలో వెలుగుచూసింది.
తీవ్ర కడుపునొప్పితో మే 2న ఆస్పత్రిలో చేరిన బాలికకు వైద్యులు లాపరోస్కోపీ నిర్వహించారు. ఆమె ప్రేవులకు రక్తాన్ని సరఫరా చేసే సిరల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అనుమతించాలని బాలిక రిధానియా (17) వైద్యులను కోరింది.
ఆమె కోలుకుంటుండటంతో వైద్య బృందం సాయంతో బాలికను పరీక్షా కేంద్రానికి అంబులెన్స్లో వెళ్లేందుకు అనుమతించారు. రిధనియా బాగా కోలుకుంటున్నదని, పరీక్ష రాయాలని ఉత్సాహంగా ఉండటంతో ఆమెను అన్ని జాగ్రత్తలతో పరీక్షా కేంద్రానికి పంపామని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ అరుళ్ జ్యోతి తెలిపారు.