గత ఆరేడు సంవత్సరాలతో పోలిస్తే భారత దేశంలో 45 శాతం పాల ఉత్పత్తి పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పాల ఉత్పత్తిలో భారత్ 22 శాతం ఉత్పత్తి చేస్తోందన్నారు. కేవలం పాల ఉత్పత్తిలోనే కాకుండా, డెయిరీ రంగంలోనూ ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉండడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మరోసారి యూపీలో పర్యటించారు. డెయిరీ, ఆరోగ్యంతో సహా పలు ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ… దేశంలోని డెయిరీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి శతధా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. డెయిరీ, పశుపోషణలో విప్లవా ద్వారా రైతుల తల రాతలు మారతాయన్నది తాను బలంగా విశ్వసిస్తానని అన్నారు. పశు పోషణ ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, భారత్కు సంబంధించిన డెయిరీ ఉత్పత్తులకు మంచి గుర్తింపు కూడా లభిస్తోందన్నారు.
విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డ మోదీ
గోవుల గురించి, గోమయం గురించి కొందరు జోకులు వేసుకుంటున్నారని,నేరంగా భావిస్తారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మోదీ మండిపడ్డారు. తాము మాత్రం గోవును అత్యంత పవిత్రంగా భావిస్తామని మోదీ పేర్కొన్నారు. ఆవును, పశుసంపద చాలా మందికి జీవికనిస్తోందని, ఈ విషయాన్ని విమర్శించే వాళ్లు మరిచిపోతున్నారని, వాళ్ల కడుపు కొడుతున్న విషయాన్ని వారు మరిచిపోతున్నారని మోదీ అన్నారు.