కొత్తగూడెం క్రైం, జనవరి 31: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టులు ఏకంగా సొరంగాలనే ఏర్పాటు చేసుకున్నారు. వాటిని మంగళవారం అక్కడి పోలీసులు గుర్తించి ఫొటోలు, వీడియోలను మీడియాకు విడుదల చేశారు. సొరంగాలు ఉన్న ప్రాంతం దండకారణ్యంలోని దంతెవాడ.. అని ప్రాథమికంగా తెలుస్తున్నది. ఒక్కో సొరంగం కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోనూ సొరంగాలు ఉన్నట్లు అక్కడి పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. మంగళవారం సుక్మా జిల్లా టేకులగూడ సీఆర్పీఎఫ్ క్యాంప్పై మావోయిస్టులు మెరుపుదాడి చేసి ముగ్గురు జవాన్లను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. దాడి వెనుక మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు మాస్టర్ మైండ్ హిడ్మా హస్తం ఉందని, మంగళవారం జరిగిన మెరుపు దాడికి హిడ్మా భార్య రాజక్కనే నాయకత్వం వహించిందనే అనుమానాలు తెరమీదకు వచ్చాయి. ఘటనలో రాజక్క తీవ్రంగా గాయపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.