ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్కి గడ్డుకాలం నడుస్తోందని సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే తేల్చి చెప్పారు. అయితే.. పార్టీకి తిరిగి జవసత్వాలు నింపడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ని అధిష్ఠానం రంగంలోకి దింపుతుందని అందరూ భావించారు. కానీ.. హఠాత్తుగా కాంగ్రెస్.. తెలుగువాడైన సునీల్ కనుగోలును రంగంలోకి దింపింది. అటు పార్టీ భవిష్యత్తును, ఇటు రాహుల్ ఛరిష్మాను ఒకేసారి పైకి తీసుకువచ్చే బాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపింది.
అయితే.. ఆయన సార్వత్రిక ఎన్నికల కోసమే పనిచేస్తారని అందరూ భావించారు. కానీ… దేశ రాజకీయాలను పసిగట్టిన కాంగ్రెస్.. ఆయన్ను తొందరగానే పనిలోకి దింపినట్లు తెలుస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన్ను రంగంలోకి దింపాలని, ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని సునీల్ కనుగోలును అధిష్ఠానం ఆదేశించిందట. దీంతో ఆయన మొట్ట మొదటి టార్గెట్ కర్నాటక అయిపోయింది. కర్నాటక ఎన్నికల ప్రచార బాధ్యతను కూడా ఈయనకే అప్పగించింది అధిష్ఠానం.
సునీల్ కనుగోలు సౌత్ ఇండియాకు చెందినవాడు. ఈ కారణంగానే కర్నాటక ప్రచార బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఆయనకు వివిధ భాషలు కూడా తెలుసు కాబట్టి, కర్నాటక ఎన్నికలు ఆయనకు సులువుగా అవుతాయని కాంగ్రెస్ అంచనా. ఇక.. ఇప్పటికే సునీల్ కనుగోలు టీమ్.. కర్నాటకకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. 150 మంది ఉద్యోగులను కూడా విధుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత మందిని కూడా రిక్రూట్ చేసుకునేందుకు సునీల్ కనుగోలు టీం రెడీ అయిపోయింది.