ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్లో చేరిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. కానీ.. రాబోయే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే, గుజరాత్ పోల్స్పై చర్చించడానికే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల విషయంలో బ్లూప్రింట్పై కూడా చర్చించే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా అధిష్ఠానం పీకే చేతిలో పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. పీకే శిష్యుడు సునీల్ కనుగోలుకు కూడా ఇదే తరహా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారన్న ప్రచారమూ వుంది. మరి ఎవరిని వ్యూహం బరిలోకి దింపనున్నారో తెలియడం లేదు.
వ్యతిరేకిస్తున్న గుజరాత్ నేతలు
గుజరాత్ ప్రచార బాధ్యతలు ప్రశాంత్ కిశోర్కు అధిష్ఠానం అప్పగిస్తుందన్న వార్తలపై గుజరాత్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీకే రావడం వల్ల కాంగ్రెస్కు పెద్ద ఒరిగేదీ ఏమీ వుండదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్కు మంచి పట్టుందని అంటున్నారు. ఇలాంటి సమయాల్లో కోట్ల కొలది డబ్బును కుమ్మరించి పీకేను తీసుకురావడం నిరర్ధకమని ఓ గ్రూపు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక మరో గ్రూపు మాత్రం పీకే రావాల్సిందేనని, అయితేనే అధికారం వస్తుందని ప్రచారం చేస్తోంది.