న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత (Stubble burning) వల్ల వెలువడుతున్న దట్టమైన పొగలు ఢిల్లీలో కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉన్నది.
ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయమై బుధవారం ఢిల్లీతోపాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.