Vande Bharat | పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్లోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ కోచ్ కిటికీ పగిలింది. బనారస్ నుంచి రాంచీకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ససారం రైల్వే స్టేషన్ అనంతరం నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అకస్మాత్తుగా ఓ పదునైన రాయి కోచ్ నంబర్ సీ7 విండోకు తగిలింది. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత దెబ్బతిన్న కిటికీని రైలు ఎస్కార్ బృందం, ఇతర సిబ్బంది పరిశీలించారు. ఈ విషయంపై ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రాళ్ల దాడి సమాచారం మేరకు ససారం స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్ విచారణ సందర్భంగా రైలు ఎస్కార్ట్ పార్టీని, ఇతర సిబ్బందిని విచారించారని తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ససారం స్టేషన్ నుంచి సాయంత్రం 5.52గంటలకు బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి దాడి చేయడంతో కోచ్ నంబర్ సీ7 కిటికీ అద్దం పగిలిందని చెప్పారు.
ఈ విషయమై సీటు నంబర్ 25లో కూర్చున్న అమరేంద్ర కుమార్ అనే ప్రయాణికుడిని సంప్రదించగా.. ససారం స్టేషన్కు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కరాబండియా స్టేషన్కు సమీపంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని ఆ తర్వాత.. దక్షిణం వైపు అద్దం పగిలిపోయి కనిపించిందని తెలిపారు. అనంతరం రైల్వే సిబ్బంది కూడా కోచ్ వద్దకు చేరుకుని దెబ్బతిన్న గాజును పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.