Modi @ VSP | ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖ పర్యటనలో నిరసన సెగ తగిలే అవకాశాలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ను ప్రైవేటీకరించడంపై ఉద్యోగులు మోదీకి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో తమ ఆందోళనలను ఉధృతం చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి కార్యాచరణ రూపొందించింది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం వలన తమ కుటుంబాలు అనుభవిస్తున్న భాధలు ప్రధాని మోదీకి తెలిసేలా తమ నిరసన ఉంటుందని పోరాట సమితి నాయకులు చెప్పారు.
విశాఖపట్నంలో ఈ నెల 11 ప్రధాని మోదీ పర్యటించనున్నారు. స్టీల్ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించుకోవాలన్న ప్రణాళికపై వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి (వీఎస్పీపీఎస్) నిరసన తెలుపనున్నది. మోదీ విశాఖకు వచ్చిన రోజు దాదాపు 10 వేల మంది ఉద్యోగులు మూకుమ్మడిగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. నవంబర్ 9న గుర్రంపాలెం నుంచి ద్వారకానగర్లోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు 1,000 మందితో బైక్ ర్యాలీ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వీఎస్పీ ప్రైవేటీకరణతో తామెంత ఇబ్బందిపడతామన్నది ప్రధానికి చేరేలా తమ నిరసనలు ఉంటాయని వీఎస్పీపీఎస్ నేతలు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 3 న ప్రారంభమైన వీఎస్పీ పోరాట సమితి ఆందోళనలు ఇవాల్టికి 635 రోజులకు చేరుకున్నాయి.
స్టీల్ ప్లాంట్పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను ప్రదర్శిస్తానమి సమితి కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు. ఇప్పటికే నగరంలోని 10 వేల పాయింట్లలో ‘మోదీ జీ స్టాప్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సేల్’ పోస్టర్లు అతికించినట్లు చెప్పారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు ఎలాంటి అవాంతరాలు కల్పించమని స్పష్టం చేశారు. ప్రధానిని కలిసి విన్నవించేందుకు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులకు విన్నవించినట్లు అయోధ్యరామ్ తెలిపారు.