UP CM Yogi | విధుల నిర్వహణ, అధికారిక పర్యటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. తన క్యాబినెట్ మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు కఠిన మార్గదర్శకాలు నిర్దేశించారు. అధికారులు, మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికార పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వ గెస్ట్ హౌస్ల్లో బస చేయాలే తప్ప హోటళ్లకు వెళ్లకూడదని తేల్చి చెప్పారు. మంత్రులు తమ బంధువులను పర్సనల్ సెక్రటరీలుగా నియమించుకోవద్దని సూచించారు. గెస్ట్ హౌస్ల్లోనే బస చేయాలన్న ఆదేశాలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేశారు. వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు వేళకు డ్యూటీకి రావాలని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
ఆఫీసులకు ఆలస్యంగా వచ్చే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రతి ఆఫీసులోనూ సిటిజన్ చార్టర్ అమలు చేయాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది, అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. ఏ ఫైల్ కూడా మూడు రోజులకు మించి పెండింగ్లో ఉండరాదని స్పష్టం చేశారు.
మధ్యాహ్న భోజన విరామ సమయం అర్ధగంటకు మించొద్దని తెలిపారు. అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు సర్కార్ గెస్ట్హౌజ్ల్లోనే బస చేయాలని గతంలోనే సీఎం యోగి ఆదేశించారని ఓ అధికారి చెప్పారు. మంత్రులు కూడా తమ బంధువులను పర్సనల్ సెక్రటరీలుగా నియమించుకోబోమని సీఎంతో చెప్పారని అన్నారు.