వ్యాట్ తగ్గించనందుకే ఇంధన ధరలు పైపైకి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సామాన్యుల నడ్డివిరుస్తూ దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ర్టాలు పన్నులు తగ్గించడంలేదని దుయ్యబట్టారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ర్టాలు పన్నులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇంధన ధరలను ప్రస్తావించారు.
మీరు కూడా వ్యాట్ తగ్గించండి
వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడుతూ.. ‘ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు గత ఏడాది నవంబర్లో కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇదే సమయంలో వ్యాట్ను తగ్గించాలని అన్ని రాష్ర్టాలను కోరింది. బీజేపీపాలిత రాష్ర్టాలు వివిధ మార్జిన్లలో వ్యాట్ను తగ్గించాయి. అయితే, ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వ్యాట్ను తగ్గించలేదు. దీంతో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే, ఈ రాష్ర్టాల్లో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి’ అన్నారు.
ఎవరినీ విమర్శించట్లేదు
ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల రాజధానుల్లో పెట్రోల్ రేట్లను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ‘లీటర్ పెట్రోల్ చెన్నైలో రూ. 111, జైపూర్లో రూ. 118, హైదరాబాద్లో రూ. 119, కోల్కతాలో రూ. 115, ముంబైలో రూ. 120గా ఉన్నది. కేంద్రపాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యూలో లీటర్ పెట్రోల్ రూ. 102, లక్నోలో రూ. 105, జమ్ములో రూ. 106, గువాహటిలో రూ. 105, డెహ్రాడూన్లో రూ. 103గా ఉన్నది. ఇంధన ధరలపై వచ్చే ఆదాయంలో 42 శాతాన్ని కేంద్రం ఎలాగో రాష్ర్టాలకు పంచుతున్నది. కాబట్టి, ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ఇకనైనా ఆయా రాష్ర్టాలు పన్నులను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రాష్ట్రంలో ఎక్కువ ధరలు, మరో రాష్ట్రంలో తక్కువ ధరలకు ఇంధనం లభించడం ప్రజలకు అన్యాయం చేయడమే. నేను ఎవరినీ విమర్శించట్లేదు. మీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వ్యాట్ను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు.
అప్రమత్తత అవసరం
గడిచిన రెండు వారాల్లో కొన్ని రాష్ర్టాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.