న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్లను నియమించే అధికారాన్ని రాష్ర్టాలకు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ఎంపీ వీ శివదాసన్ ఉద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-2022 ఆమోదానికి మద్దతు తెలపాలని శుక్రవారం ఆయన రాజ్యసభలో సభ్యులను కోరారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శివదాసన్ నిరుడు డిసెంబర్ 9న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై శుక్రవారం ఆయన సభలో చర్చను ప్రారంభిస్తూ.. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మల్లా ఆడిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్లను రాష్ట్రపతి నియమించే విధానానికి స్వస్తి పలకాలని, గవర్నర్లను తమంతట తామే నియమించుకునే అధికారాన్ని రాష్ర్టాలకు ఇవ్వడం ద్వారా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని కోరారు.