చెన్నై: బీజేపీ దశాబ్ధ పాలనలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కుల్ని కోల్పోయినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు. బీజేపీ పాలన లేని రాష్ట్రాల్లో గవర్నర్లతో నిరంకుశ విధానాన్ని అవలంబిస్తున్నట్లు విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాకుండా పాలనపై ఆధిపత్యం చెలాయించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు రాష్ట్రాలకు తమ స్వతంత్రతా గౌరవం దక్కుతుందని అన్నారు. గడిచిన పదేళ్లలో ఏన్నో రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోయాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల విద్య, భాష, ఆర్థిక, న్యాయ వ్యవస్థలపై కేంద్రం తన ప్రభావం చూపిస్తోందని స్టాలిన్ తెలిపారు. గవర్నర్ల వల్లే దేశంలో రాజకీయ వ్యవస్థ క్షీణించినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.