ఢిల్లీ: కరోనా వ్యాప్తి ఢిల్లీలో చాలావరకు అదుపులోకి వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వం దశలవారీగా అన్లాక్ ప్రక్రియను ప్రారంభిస్తుందని చెప్పారు. సోమవారం నుంచి నిర్మాణ కార్యకలాపాలు, ఫ్యాక్టరీలను వారం పాటు అనుమతించి, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.
ఉత్తరప్రదేశ్: కరోనా కర్ఫ్యూను వచ్చే నెల మొదటి వారం నుంచి సడలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నాయి.
మహారాష్ట్ర: లాక్డౌన్ తరహా ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్యశాఖమంత్రి రాజేశ్ తోపే తెలిపారు. అయితే జూన్ 1 కొత్త మార్గదర్శకాలు ప్రకటిస్తామని చెప్పారు.
తమిళనాడు: లాక్డౌన్ను వచ్చే నెల 7 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే నెల నుంచి 13 రకాల సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
నాగాలాండ్: సంపూర్ణ లాక్డౌన్ను వచ్చే నెల 11 వరకు పొడిగించారు. తొలుత ఈ నెల 14న వారం పాటు లాక్డౌన్ విధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అనంతరం పొడిగిస్తూ వస్తున్నది.
అరుణాచల్ ప్రదేశ్: లాక్డౌన్ను వచ్చే నెల 7 వరకు పొడిగించారు.