ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభపరిస్థితుల ప్రభావం కొలువుల మీద పడుతున్నది. ఆర్థికమాంద్యం ఛాయలతో గత రెండేండ్లుగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు మాయమయ్యాయి. ఇదే ధోరణి కొత్త ఏడాదిలోనూ కనిపించేలా ఉన్నది. లక్షలాది కొలువులకు కోతపడవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Layoffs | న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కొలువుల కోత కొనసాగుతూనే ఉన్నది. అన్ని రంగాల్లో వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులను వదిలించుకొనేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. రెండేండ్ల క్రితం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆశాదీపంగా కనిపించిన స్టార్టప్ కంపెనీలు.. ఆర్థికమాంద్యం భయాలతో కుదేలై ఉద్యోగులను కనికరం లేకుండా బయటకు గెంటేస్తున్నాయి. భారత్లో గత రెండేండ్లలో స్టార్టప్ కంపెనీలే 35 వేల మంది ఉద్యోగులను తొలగించాయని లెక్కలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది మరిన్ని ఉద్యోగ కోతలుంటాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే లక్షల్లో ఉద్యోగ కోతలుంటాయని ఆ దేశ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) అంచనా వేసింది. దీంతో కొత్త సంవత్సరం కోతలతోనే మొదలవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
వేలమంది ఇంటికే
భారత్లో 2022లో కేవలం స్టార్టప్ కంపెనీలే దాదాపు 18 వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. 2023లోనైనా పరిస్థితి మెరుగవుతుందని భావించారు. కానీ, ఈ ఏడాది ఇప్పటికే 17 వేల మందికిపై ఉద్యోగులను స్టార్టప్ కంపెనీలు కొలువుల నుంచి తొలగించాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో మరోసారి ప్రపంచంలో ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో 2022లో స్టార్టప్ కంపెనీలు భారీగా ఉద్యోగులను వదిలించుకొన్నాయి. 2023లో కూడా ఆ ప్రభావం కనిపించటంతో ఉద్యోగ కోతలు ఆగలేదు. మరో 5 వేల మంది వరకు అనధికారికంగా తొలగించబడినట్టు సమాచారం. బైజుస్, ఓలా, అన్అకాడెమీ, బ్లింకిట్, వైట్హ్యాట్ జూనియర్ సంస్థలు 14 వేలమందిని తొలగించాయి. ఒక్క బైజుస్లోనే 6,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
కొత్త ఏడాదిలో పరిస్థితేంటి?
కొత్త ఏడాదిలోనైనా ఉద్యోగాల కోతలు ఆగుతాయా? కొత్త ఉద్యోగాల సృష్టి ఏమైనా జరుగుతుందా? అని నిరుద్యోగులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు మాత్రం ఉద్యోగాల కోతలనే సూచిస్తున్నాయని పలు సంస్థలు అంటున్నాయి. 2024లో ఒక్క అమెరికాలోనే లక్షల్లో ఉద్యోగాలు ఊడిపోవచ్చని సీబీవో అంచనా వేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, కొత్తగా ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడే అవకాశాలు కనిపించటంలేదు. మరోవైపు అన్ని రంగాల్లోకి కృత్రిమ మేధ సాంకేతికత దూసుకొస్తున్నది. ఈ నేపథ్యంలో పోయిన ఉద్యోగాలను మళ్లీ భర్తీ చేసే అవకాశాలు తక్కువగానే ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థికమందగమనం తొలగకపోతే 2024లోనూ ఉద్యోగ కోతలను భారీగానే చూడాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల కోతపై రిజ్యూమ్బిల్డర్స్ డాట్కామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో మూడు అంశాలు వెల్లడయ్యాయి. 906 కంపెనీలను ఈ సంస్థ సర్వే చేయగా, 2024లో తమ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ఉంటుందని 65 శాతంమంది కంపెనీల యజమానులు తెలిపారు. 50 శాతం మంది కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగులను నియమించుకోవటంలేదని చెప్పారు. 70 శాతం మంది ఏఐ టెక్నాలజీ వల్లనే ఉద్యోగులను తొలగిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఉద్యోగులను తొలగించకుండా ఖర్చులను తగ్గించుకొనేందుకు కంపెనీలు కొత్త మార్గాలను వెదుకుతున్నట్టు తేలింది. ఉద్యోగులను అదనపు సౌకర్యాలు, బోనస్లు, బెనిఫిట్స్ను తీసేయటం వంటివి ఇందులో ఉన్నాయి.
2023లో లక్షన్నర ఉద్యోగాలు ఊస్ట్
ప్రపంచవ్యాప్తంగా 2023లో గూగుల్, ట్విట్టర్ (ఎక్స్), అమెజాన్ వంటి సంస్థలు వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ట్విట్టర్ను మస్క్ కొన్న తర్వాత ఒక్కసారే సంస్థలోని 80 శాతం మందిని ఉద్యోగాల నుంచి పీకేశారు. గూగుల్ ఒక్కసారే 15000 మందిని తొలగించింది. ఇలా 2023లో 1,65,000 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారని అంచనా. తాజాగా అమెరికాకు చెందిన ఈ-కామర్స్ కంపెనీ ‘బోల్ట్’ 29 శాతం మంది తొలగిస్తామని ప్రకటించింది.