శ్రీనగర్, నవంబర్ 13: పిండిపదార్థం తక్కువగా ఉండేలా అన్నం వండి డయాబెటిస్ రోగుల ఆరోగ్యాన్ని కాపాడే రైస్ కుక్కర్ను కశ్మీర్ వర్సిటీ విద్యార్థులు ఆవిష్కరించారు. దీనికి ‘స్టార్చ్ రైస్ కుక్కర్’ అని పేరుపెట్టారు. ఇండియన్ పేటెంట్ అథారిటీ నుంచి ఆదివారం పేటెంట్ హక్కులు కూడా అందుకున్నారు.
టెక్ట్స్ మెసేజ్తో అన్నం వండే సదుపాయం ఉన్న ఈ కుక్కర్ను కశ్మీర్ వర్సిటీకి చెందిన డాక్టర్ బిలాల్ అహ్మద్ మాలిక్ నేతృత్వంలో సాజిద్ నూర్, జహంగీర్ హమీద్లోనె, ఇమ్రాన్ నజీర్, అజర్ హుస్సేన్, అనే నలుగురు విద్యార్థులు తయారుచేశారు. ఇందులో బియ్యం, నీళ్లు పోసేందుకు రెండు వేర్వేరు గదులుంటాయి. ఫోన్ నుంచి మెసేజ్ పంపగానే ఆటోమెటిక్గా బియ్యం, సరిపడా నీళ్లు తీసుకుంటుంది. అన్నం వండేటప్పుడు స్టార్చ్ లెవల్ను ఎప్పటికప్పుడూ తెలియజేస్తుంటుంది.