సిమ్లా: కొండచరియలు విరిగి పడటంతో పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (Stampede At Shrine Due To Landslide) హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మైరీ గ్రామంలోని డేరా బాబా వద్భాగ్ సింగ్ క్షేత్రాన్ని సందర్శిస్తే దుష్ట శక్తుల నుంచి నివారణ కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న జాతరకు భక్తులు పొటెత్తారు. సోమవారం పౌర్ణమి కావడంతో ఉదయం 5 గంటల సమయంలో పవిత్ర గంగా నది పాదాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో స్నానమాచరించారు.
కాగా, ఆ కొండ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు దొర్లుకుంటూ రావడం చూసి భక్తులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో 9 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే అంబాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మృతులను పంజాబ్లోని ఫరీద్కోట్కు చెందిన బిల్లా, బల్వీర్ చంద్గా గుర్తించారు.
మరోవైపు గాయపడిన వారిలో ఐదుగురిని ఉనా జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీరియస్గా ఉన్న మరో ఇద్దరిని చండీగఢ్లోని పీజీఐకు రిఫర్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకు భక్తులను పవిత్ర స్నానానికి అనుమతించబోమని చెప్పారు.