నీట్ బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి పంపకపోవడంపై స్టాలిన్
గవర్నర్ రవితో వ్యక్తిగత శత్రుత్వమేమీ లేదని వ్యాఖ్య
చెన్నై/చిదంబరం, ఏప్రిల్ 18: అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవించి ఆయన బిల్లును ఢిల్లీకి పంపాల్సి ఉందని, అయితే అలా చేయకపోవడం సరికాదని, సభా గౌరవానికి కూడా భంగం వాటిల్లినట్టేనని అన్నారు. సీఎం స్టాలిన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ బిల్లును అసెంబ్లీ ఆమోదించి తిరిగి పంపి 70 రోజులు అయిందన్నారు. బిల్లును రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని వస్తున్న వార్తలపై స్టాలిన్ స్పందిస్తూ.. దీనికి సంబంధించి పరిణామాలను పరిశీలించిన తర్వాత, అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
గవర్నర్తో శత్రుత్వమేమీ లేదు
గవర్నర్ రవి ఇటీవల రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ఎవరూ హాజరుకాకపోవడంపై స్టాలిన్ సభా వేదికగా వివరణ ఇచ్చారు. గవర్నర్పై తమకు వ్యక్తిగతంగా శత్రుత్వమేమీ లేదని, ఆయనకు తమ ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందన్నారు. నీట్ వ్యతిరేక బిల్లు పెండింగ్లో ఉంచిన కారణంగానే తాము పోలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ కార్యక్రమంలో తాము పాల్గొంటే అది రాష్ట్రంలోని 7.5 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే అవుతుందని, ఇదే సమయంలో అసెంబ్లీ గౌరవాన్ని మరింత దిగజార్చినట్టు ఉంటుందని అన్నారు. అందుకే సభ గౌరవాన్ని కాపాడేందుకు తాము ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇద్దరు మంత్రుల గైర్హాజరు
రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఎపిసోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి కొనసాగింపుగా మరో పరిణామం చోటుచేసుకున్నది. గవర్నర్ రవి సోమవారం హాజరైన అన్నామలై యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కే పొన్ముడితో పాటు మరో మంత్రి ఎంఆర్కే పన్వీర్ సెల్వం హాజరుకాలేదు. నీట్ బిల్లు పెండింగ్లో పెట్టిన కారణంగానే తాము హాజరుకాలేదని సెల్వం తెలిపారు.