లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి బరిలో నిలిచిన సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఓడిస్తానని ఆయనపై పోటీ చేసిన ఎస్పీ అభ్యర్ధి శుభావతి శుక్లా అన్నారు. గోరఖ్పూర్లోని మహిళలు, అక్కాచెల్లెళ్లు తనతో ఉన్నారని, ఇక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్కు భంగపాటు తప్పదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో సీఎం యోగి తన భర్తను ఓడించారని, భర్త మరణించిన తర్వాత తమ కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తనను తన తల్లిలా చూస్తారని ఆయన తన మూడో కొడుకని శుభావతి శుక్లా అన్నారు.
గోరఖ్పూర్ అర్భన్ స్ధానంలో యోగిపై బరిలో నిలిచిన ఆమె ఆరో దశ పోలింగ్లో గురువారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు గోరఖ్పూర్లోని గోరఖ్నాధ్ కన్యానగర్ క్షేత్రలోని ప్రైమరీ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక యూపీలోని పది జిల్లాల్లో ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పది జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా దాదాపు 1.5 లక్షల మంది భద్రతా సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు.
ఆరో విడత పోరులో అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిద్ధార్ధ్నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, మహరాజ్గంజ్, గోరఖ్పూర్, ఖుషీనగర్, దియోరియ, బలియా జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. మార్చి 7తో ఏడు దశల పోలింగ్ ముగియనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక కుల సమీకరణలకు పెట్టింది పేరైన యూపీలో యాదవులు ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతుండగా యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.