లక్నో : టెస్టింగ్ కిట్లు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు వంటి కొవిడ్-19 సంబంధిత వస్తువుల సరఫరా పేరుతో స్పోర్ట్స్ కంపెనీ అధినేతను రూ 16.50 కోట్లకు మోసగించిన వ్యక్తి ఉదంతం యూపీలోని మీరట్లో వెలుగుచూసింది. స్టాగ్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ డైరెక్టర్ వినిత కోహ్లీని మోసగించిన నిందితుడిని ప్రణవ్ కోహ్లిగా గుర్తించారు.
వినితకు చెందిన స్టాగ్ కంపెనీకి శానిటైజర్లు, కొవిడ్ టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటి సామాగ్రిని సరఫరా చేస్తామని నమ్మబలికిన ప్రణవ్ కోహ్లి తొలుత సకాలంలో వాటిని సరఫరా చేయడంతో కంపెనీ విశ్వాసం చూరగొన్నాడు. తాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ వస్తువులు ఖరీదైనవని, స్ధానిక వ్యాపారుల వద్ద తక్కువ ధరకు వీటిని సేకరించవచ్చని వినితకు నమ్మబలికాడు. ప్రణవ్ ప్రతిపాదనకు సుముఖత చూపిన వినిత పలు దేశీ కంపెనీలకు రూ 16.50 కోట్ల ముందస్తు చెల్లింపులు జరిపారు.
నగదు చెల్లించినా సరుకు డెలివరీ కాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. చెల్లింపులు జరిపిన కంపెనీల్లో చాలావరకూ నకిలీ కంపెనీలని, మరికొన్నిటిని మూసివేశారని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు తాను రూ 15 కోట్లు నష్టపోయానని అక్టోబర్ 19న సూసైడ్ నోట్లో రాసిన ప్రణవ్ అప్పటినుంచి కనిపించడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.