సిటీబ్యూరో(హైదరాబాద్), ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): మానవతా విలువలు ప్రధానంగా ఉండే సమాజాన్ని నిర్మించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి ప్రేమికులంతా ప్రపంచ శాంతి స్థాపనకు ముందుకు రావాలని కోరారు. జెనీవాలోని ఐరాస కార్యాలయంలో ‘ఐ స్టాండ్ ఫర్ పీస్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి మనిషి తన మానసిక ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని చెప్పారు.
వార్సాలో ఉక్రెయిన్ యుద్ధ బాధితులను కలిసి వారికి బహుమతులు అందజేశారు. రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షుడు గైల్స్ కార్బొనియెర్ను కలిశారు. కార్యక్రమంలో ఐరాస డైరక్టర్ జనరల్ తాతియాన వలోవయ, ఐరాసలో భారత శాశ్వత సభ్యురాలు ఇంద్రమణి పాండే తదితరులు పాల్గొన్నారు.