న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) తన పైలట్లకు షాకిచ్చింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పైలట్లను బలవంతంగా సెలవులపై పంపింది. 80 మంది పైలట్లను మూడు నెలలపాటు సెలవుల్లోకి పంపినట్లు సంస్థ వెల్లడించింది. ఈ కాలానికి వారికి ఎలాంటి వేతనమూ చెల్లించడం లేదని స్పష్టం చేసింది. కంపెనీ వ్యయాలను హేతుబద్ధీకరించడంతో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని పేర్కొన్నది. వారిని వీలైనంత తొందరగా విధుల్లోకి తీసకుంటామని చెప్పింది. కాగా, వీరంతా బోయింగ్, క్యూ400 విమానాలకు చెందిన పైలట్లుగా తెలుస్తున్నది.
కంపెనీ నిర్ణయంపై పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల తర్వాత మళ్లీ తమను వెనక్కి పిలుస్తారా? లేదా అనేదానిపై స్పష్టత లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉన్నదని చెప్పారు. కాగా, స్పైస్ జెట్ విమానాల్లో భద్రతా కారణాల దృష్ట్యా వచ్చే ఎనిమిది వారాల పాటు 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఐ) ఈఏడాది జులై 27న కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసింది. దీంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి.