న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీనిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆగస్టు 7న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు మమత ఢిల్లీకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె రాకకు సంబంధించి అధికారికంగా ఏమీ తెలియదు. ఆ సమావేశానికి ఆమె హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఒకవేళ సమావేశం కొరకు వచ్చినా విడిగా ప్రధానితో సమావేశం అవుతారా? లేదా? అనేది ఇదమిద్ధంగా తెలియదు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని సీఎంలతో సమావేశమవుతున్నారు. తృణమూల్ నేత పార్థ చటర్జీ అరెస్టు, అందులో ఈడీ పాత్రపై బెంగాల్లో దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో మమత ఢిల్లీ పర్యటనపై సహజంగానే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానితో బెంగాల్ సీఎం చాలాకాలంగా ఎడమొగం పెడమొగంగా ఉన్న సంగతి తెలిసిందే. పోయినసారి బెంగాల్లో వరదలు వచ్చినప్పుడు ప్రధాని పర్యటనకు వెళ్లారు. ప్రధానికి స్వాగతం చెప్పాల్సి ఉన్నప్పటికీ మమత వెళ్లలేదు. మమత ఢిల్లీకి రావడం అంటూ జరిగితే ప్రధానిని కలిసినా కలవకపోయినా విపక్షాల నేతలతో మాత్రం సమావేశం అవుతారని అంటున్నారు.