బెంగుళూరు: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar)పై క్రిమినల్ కేసు బుక్ చేయాలని నగరానికి చెందిన స్పెషల్ కోర్టు స్థానిక పోలీసుల్ని ఆదేశించింది. కాంగ్రెస్ ఐటీ సెల్ నేత బీఆర్ నాయుడుపై కూడా కేసు పెట్టాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బీజేపీ నేతలకు చెందిన నిరసన ఫోటోను మార్పింగ్ చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో శ్రీకాంత్ పూజారి అన్న కర సేవకుడు పాల్గొన్నారు. అయితే ఆ కర సేవకుడిని ఇటీవల కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆ అరెస్టును ఖండిస్తూ బీజేపీ నేతలు ఓ ఆందోళన చేపట్టారు. నేను కూడా కర సేవకుడిని, నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన నిర్వహించారు.
ప్లకార్డులతో ఉన్న ఫోటోను కాంగ్రెస్ ఐటీ సెల్ మార్పింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కామ్లు, అక్రమాలు జరిగినట్లు ఆ ఫోటోను మార్ఫింగ్ చేశారు. అయితే ఆ ఫోటోను డిప్యూటీ సీఎం శివకుమార్ సోషల్ మీడియా అకౌంట్లోనూ పోస్టు చేశారు.
రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు కాంగ్రెస్ నేతలు మార్ఫింగ్ ఫోటోను వాడినట్లు బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యోగేంద్ర హొడగట్ట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. సీఆర్పీసీలోని 156(3) సెక్షన్ కింద కేసు బుక్ చేయాలని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్కు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.