Madhya Pradesh Assembly Polls | ప్రధాని నరేంద్రమోదీ మొదలు బీజేపీ నేతలంతా విపక్ష పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో `డబుల్ ఇంజిన్ సర్కార్` అనే నినాదం వినిపిస్తూ ఉంటారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రగతి సాధ్యమని ఊదరగొడుతుంటారు. కానీ 2003 నుంచి ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది.. పదేండ్లుగా అటు కేంద్రం.. ఇటు మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ మధ్య ప్రదేశ్ వాసులు బతకడానికి పని లేక ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు. రాష్ట్రంలోని అలిరాజ్ పూర్, ధార్, జాబువా, ఖర్గోన్, బార్వానీ జిల్లాల నుంచి లక్షల మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు వచ్చే నెలలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ వంటివని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన గిరిజన కార్మికులను ఓటింగ్ కు రప్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా అలీరాజ్ పూర్ జిల్లా నుంచి గుజరాత్లోని సురేంద్ర నగర్ జిల్లాలోని జిన్నింగ్ ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు వెళ్లే వారిని రప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వారందరి మొబైల్ ఫోన్ నంబర్లు సేకరించి మరీ, పోలింగ్ నాటికి రావాలని అవగాహన కల్పిస్తున్నారు అధికార యంత్రాంగం.
కార్పొరేట్ కంపెనీలకు దాసోహం అంటూ కార్మిక చట్టాల్లో సంస్కరణలు తెచ్చింది కేంద్రం.. కానీ ఎన్నికల వేళ, ఓటర్ల మద్దతు కోసం వలస వెళ్లిన వారు ఓటు వేయడానికి వచ్చేందుకు ‘పెయిడ్ లీవ్’ ఇవ్వాలని సంబంధిత కంపెనీల యాజమాన్యాలను అలీరాజ్ పూర్ యంత్రాంగం కోరుతోంది. వలస వెళ్లిన వారిని పోలింగ్ నాటికి రప్పించేందుకు అలీరాజ్ పూర్ జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ లో 20 మంది టీం పని చేస్తున్నదని జిల్లా కలెక్టర్ అభయ్ అరవింద్ బెడెకర్ చెప్పారు. మధ్యప్రదేశ్ లోని 230 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరుగనున్నది. వలస కార్మికులను రప్పించడానికి అధికారుల టీమ్స్ను సంబంధిత రాష్ట్రాలకు పంపుతున్నారు.
ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆయా ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వలస వెళ్లిన వారి మొబైల్ ఫోన్లకు ప్రత్యేకంగా తయారు చేసిన పాటలు పంపుతున్నారు. ‘మమార్ ఆవో.. మామార్ ఆవోరే.. వుటు నఖానే మామార్ ఆవోరే (త్వరగా రా. త్వరగా వచ్చి ఓటేయ్)’ అని గిరిజనుల భాషలోనే పాట కూడా తయారు చేశారు.
తద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల అవగాహన కల్పించడమే పనిగా అలీరాజ్ పూర్ జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. అలీరాజ్ పూర్ జిల్లాలో ఉపాధి లేక భారీగా గిరిజనులు వలస వెళ్లారు. ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు (అలీరాజ్ పూర్, జోబాత్) ఉన్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 5.66 లక్షల ఓటర్లు ఉన్నారు. వారిలో 85 వేల మంది ప్రజలు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వలస వెళ్లారు. 2018 ఎన్నికల్లో జోబాత్ అసెంబ్లీ సెగ్మెంట్లో 52.85 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
మధ్యప్రదేశ్ తో పోలిస్తే గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అధిక వేతనాలు లభిస్తున్నాయని వలస కార్మికులు చెబుతున్నారు. పని చేయడానికి తమకు ఊళ్లో భూమి లేదని, అధిక వేతనం కోసం కుటుంబంతోపాటు గుజరాత్ వలస వచ్చానని కిర్లా దోడడ్వా అనే కార్మికుడు చెప్పాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లాలంటే నాలుగైదు రోజుల సెలవు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు.