Lok Sabha : లోక్సభ (Lok Sabha) లో స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. మంగళవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) మహమ్మద్ జావెద్ (Mohammad Javed) ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై చర్చ మొదలైంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. చర్చ తర్వాత తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
కాగా ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. అందుకు అంగీకరించిన కేంద్రం.. సీనియర్ ఎంపీ, ఛైర్పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ను స్పెషల్ స్పీకర్గా నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతున్నది.
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబెపై చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి.
ఇందుకోసం 118 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 293 ఓట్ల సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. దాంతో విపక్షాలు తీర్మానం నెగ్గే అవకాశాలు దాదాపు కనిపించడంలేదు.