లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 2న వారణాసిలో పర్యటించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్ను బీజేపీ కార్యకర్తలు అడ్డగించిన ఘటనపై ఈసీకి ఎస్పీ ఫిర్యాదు చేసింది. దీద కాన్వాయ్ అడ్డగింత బీజేపీ కార్యకర్తల పనేనని ఎస్పీ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్పీ నేత కిరణ్మయ్ నందా ఈసీని కోరారు. కర్రలు చేతపట్టిన కాషాయ పార్టీ కార్యకర్తలు సీఎం మమతా బెనర్జీ కారుపై దాడి చేసి, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఈసీకి రాసిన లేఖలో నందా ఆరోపించారు. దీదీని గాయపరచాలనే ఉద్దేశంతో ఆమెపై పలు వస్తువులు విసిరివేశారని అన్నారు. స్ధానిక పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారని, అయితే సీఎంకు తగినంత భద్రత కల్పించలేదని ఆరోపించారు. దాదాపు 30 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారని అన్నారు.
జడ్ప్లస్ భద్రత కలిగిన ముఖ్యమంత్రికి హాని తలపెట్టేలా ముందస్తు ప్రణాళికతోనే ఇదంతా జరిగిందని అన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. దీదీ పర్యటనకు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారని, ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా స్పష్టంగా వెల్లడవుతోందని ఆరోపించారు.ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది విడత పోరు కీలక దశకు చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మెగా రోడ్షోలు, భారీ ర్యాలీలతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
ఉక్రెయిన్ అంశాన్నీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం ముంగిట పలు సవాళ్లు ఎదురైన సందర్భంలో విపక్షాలు వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన భద్రతా దళాలు, ప్రజలు సంక్షోభాన్ని అధిగమించేందుకు పోరాడుతుంటే వాటిని మరింత సంక్లిష్టం చేసేందుకు వారు (ప్రతిపక్షాలు) అన్ని ప్రయత్నాలు చేస్తారని మండిపడ్డారు. కాగా, ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.