హైదరాబాద్ : యూపీ ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ సమాయత్తమవుతోంది. హిందూత్వ కార్డు మీద గెలిచిన బీజేపీని గద్దె దించేందుకు ఎస్పీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. బీజేపీ ఏ కార్డు మీద అయితే గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుందో.. ఆ మాదిరిగానే ఎస్పీ ముందుకెళ్లాలని చూస్తోంది. ఎస్పీ ముస్లింలకు అనుకూలమని ముద్ర పడిన నేపథ్యంలో ఆ ముద్రను తొలగించే పనిలో పడ్డారు అఖిలేష్. దళిత ఓటర్లను సైతం ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఎస్పీ సెక్యులర్ పార్టీ అని నిరూపించుకునేందుకు అఖిలేష్ శ్రమిస్తున్నారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ వడివడిగా అడుగులేస్తున్నారు. బీజేపీని చిత్తుగా ఓడించేందుకు చాకచక్యంతో పావులు కదుపుతున్నారు. అధికారం చేజిక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో అఖిలేష్ విజయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ద్వారా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ..ఎస్పీ కార్యకర్తలు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు అఖిలేష్ యాదవ్ పూనుకున్నారు. బీజేపీ అగ్ర నాయకులు ఎల్కే అద్వానీ 1990లో రథయాత్ర చేపట్టి.. యూపీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ కూడా ఆ విధంగానే విజయ యాత్ర చేపట్టి సమర శంఖారావం పూరించాలనుకుంటున్నారు.
అయితే ఉన్నావ్లో నిర్వహించిన విజయ యాత్రలో పార్టీ కార్యకర్తలు అఖిలేష్కు చాలా బహుమానాలను అందజేశారు. ఈ బహుమానాల్లో ఓ మూడు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకటి హనుమాన్ చిత్రపటం, రెండు గద, మూడోది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం. ఈ మూడింటి మీద సర్వత్రా చర్చ జరుగుతోంది.
హనుమాన్ చిత్రపటంలో ఎస్పీ ఎన్నికల సింబల్ సైకిల్ను పొందుపరిచారు. ఈ ఫోటోను అఖిలేష్ తన రెండు చేతులతో పట్టుకుని కార్యకర్తల్లో ఆనందం నింపారు. మరో కార్యకర్త ఎస్పీ ప్రెసిడెంట్కు గద(హనుమాన్ ఆయుధం)ను అందించగా.. ఎడమ చేతితో దాన్ని పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేశారు.
గత ఎన్నికల మాదిరి కాకుండా, అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో హిందూత్వను ప్రదర్శిస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో అఖిలేష్ హిందూ ఐడెంటినీ వ్యతిరేకిస్తూ, ముస్లింలకు అనుకూలంగా ఉన్నారని బీజేపీ ప్రచారం చేసింది. దీంతో ఎస్పీ 2014, 2017, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో బీజేపీ ఆ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది.
ఉన్నావ్ విజయ్ యాత్రలో ఓ కార్యకర్త అఖిలేష్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిమను అందించాడు. ఆ విగ్రహాన్ని అఖిలేష్ సాదరంగా స్వీకరించి, తాను సెక్యూలర్ అని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. దళిత ఓట్లను ఆకర్షించేందుకు అఖిలేష్ యాదవ్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
యూపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి నెలల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం.. సెంట్రల్ గవర్నమెంట్కు సూచించిన సంగతి తెలిసిందే. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.