లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపడతామని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా, గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం రెట్టింపయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
2022 యూపీ ఎన్నికల్లో మనం 400కు పైగా స్ధానాలు దక్కించుకుంటామని అఖిలేష్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ చెబుతున్న అసత్యాలను ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని అన్నారు.కరోనా సహా రాష్ట్రంలో పలు వ్యాధులు ప్రబలుతున్నా యోగి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం చూస్తుంటే ఎస్పీ జయకేతనం ఎగురవేస్తుందనేందుకు సంకేతాలు వెల్లడవుతున్నాయని పార్టీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.