Akhilesh Yadav : ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ నుంచి మరోసారి సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. అది కూడా తన ట్వీట్ను రీట్వీట్ చేయనందుకు. ఆకాష్ సస్పెన్షన్ అనంతరం.. అతడిని తన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లోకి చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆహ్వానించారు. అది కూడా అఖిలేష్ యాదవ్ గురువారం బహిరంగంగా ఆహ్వానించారు. ఆకాష్ ఆనంద్.. బీఎస్పీ అధినేత్రి మేనల్లుడు. ఆ పార్టీలో జాతీయ ప్రతినిధిగా పని చేశారు.
అయితే, ఈ నెల 3న ఆయనను పదవి నుంచి మాయావతి తప్పించారు. అయితే, పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగవచ్చని చెప్పారు. అలాగే, ఆకాష్కు పార్టీ పదవి కావాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ను రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. దీంతో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని అశోక్ సిద్ధార్థ్ ప్రకటించారు. మాయావతి కోరినట్లుగా ఆకాష్ ఆనంద్ మామ రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ.. మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
అయితే, ఆకాష్ను పార్టీ నుంచి తొలగించడానికి గల కారణాన్ని కూడా మాయావతి వివరించారు. ఆకాష్ రాజకీయ బాధ్యతలు అప్పగించే విషయంపై మాయావతి ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే, ఈ ట్వీట్ను ఆకాష్ రీట్వీట్ చేయలేదు. తన మంచి కోసం చేసిన ఒక ట్వీట్ను ఆకాష్ కనీసం రీట్వీట్ కూడా చేయలేదని, అది అతడి విధేయతను సూచిస్తుందని మాయావతి విమర్శించారు. అలాంటి ఆకాష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అతడి రాజకీయ భవిష్యత్ విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన ఎస్పీలో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీ పార్టీ స్పందించింది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ వర్మ మాట్లాడుతూ ఆకాష్ తమ పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తామని ప్రకటించారు. అనంతరం మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఆకాష్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆకాష్ ఏ పార్టీలో చేరుతారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.