లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీ నేతలపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. అఖిలేష్ మంగళవారం బలియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీలో చోటా నేతలు చిన్నపాటి అసత్యాలు చెబుతుంటే బడా నేతలు భారీ అసత్యాలను ప్రచారం చేస్తారని, ఇక ప్రధాని మోదీ అతిభారీ అబద్ధాలను పదేపదే వల్లెవేస్తుంటారని ఆరోపించారు. బలియా ప్రజలు బీజేపీ చేతిలో పలు సందర్భాల్లో మోసపోయారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు వారు రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని ఆరోపించారు.
బీజేపీ భాగస్వామ్య పక్షాలు, మద్దతుదారులకు ఈ విషయం తెలిసినా వారు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి నియోజకవర్గంలో ఎలాంటి ఆదరణ లేదని, కాషాయ పార్టీ తీరుతో విసిగిన ప్రజలు మార్చి 3న ఎస్పీకి ఓట్లు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.